కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత చిన్మయానంద్ తనపై వస్తున్న లైంగిక వేధింపులు, న్యాయ విద్యార్థినిని కిడ్నాప్ ఆరోపణలపై తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్ పూర్లోని తన కళాశాలలో అభ్యసిస్తున్న విద్యార్థినిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. తనను అనవసరంగా ఇరికిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుకు తాను సహకరిస్తానని చెప్పారు. సిట్ను ప్రభావితం చేయాల్సిన అవసరం తనకు లేదని.. ఈ విచారణలో అసలు నిజమేంటో తేలుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. తనపై జరుగుతున్న ప్రచారం ఎంతో ఎంతగానో బాధించిందని వ్యాఖ్యానించారు. తమ కళాశాలకు యూనివర్సిటీ స్థాయి తెచ్చేందుకు చేస్తోన్న కృషిని అడ్డుకొనేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
గత నెల 24న షాజహాన్పూర్లోని ఎస్ఎస్ కళాశాలలో చదువుతున్న న్యాయ విద్యార్థిని, చిన్మయానంద్ తనతో పాటు అనేకమందిని లైంగికంగా వేధించారంటూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపింది. అప్పటి నుంచే ఆమె అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్రంగా గాలించి చివరకు ఆమెను రాజస్థాన్లో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమెను హాజరుపరిచారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు యూపీ ప్రభుత్వం నిన్న సిట్ను నియమించింది. అలాగే, ఈ నెల 12 వరకు ఆ యువతిని దిల్లీ పోలీసుల సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది. మరోవైపు, యువతి అదృశ్యానికి సంబంధించి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ చిన్మయానంద్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.