శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ లు, ‘వీ’ సెల్యులాయిడ్ పేరిట మూడు స్క్రీన్ల సినీ కాంప్లెక్స్ ను నిర్మించారు. రేపు విడుదల కానున్న ‘సాహో’తో ఈ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. ప్రపంచంలో మూడవ అతిపెద్దది, ఆసియాలో అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ గా ఇది ఖ్యాతి గాంచింది.
ఈ థియేటర్ విశేషాలను పరిశీలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించారు. ఒక థియేటర్ లో ఉన్న స్క్రీన్ వెడల్పు 106 అడుగులు కాగా, నిలువు 94 అడుగులు. ఈ థియేటర్ లో మొత్తం 670 సీట్లు ఉంటాయి. త్రీ డైమన్షన్ సౌండ్ సిస్టమ్ తో ఉంటుంది. మిగతా రెండు థియేటర్లనూ 180 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 7 ఎకరాల్లో ఈ థియేటర్లు ఉంటాయి. ఇక ఈ కొత్త స్క్రీన్లను రేపు ప్రభాస్ ప్రారంభిస్తారని సమాచారం.