గత రెండురోజులుగా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం నీరు గ్రామాల్లోకి రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెద్దముడియం మండలంలో కుందూ నదికి ఉధృతంగా ప్రవహిస్తోంది. నెమళ్ల దిన్నె బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలతో.. గండి శేషాచల కొండచరియలు విరిగిపడ్డాయి.
దీంతో గండి – రాయచోటి మార్గంలో రాకపోకలు కొద్ది సేపు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఆ దారిన పోయే కొందరు యువకులు, స్కూల్ విద్యార్థులు కొండచరియలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకుని .. మిగిలిన కొండచరియలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. కొండరాళ్లు విరిగిపడే సమయానికి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.