telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మీ పిల్లల్ని హైదరాబాద్ లో, పెద్ద స్కూల్ లో చదివిస్తున్నారా? మిమ్మల్ని అమ్మేసారు !.. చెక్ చేసుకోండి

అయితే ఒక సారి చెక్ చేసుకోండి.
మీకు తెలియకుండా.. మిమ్మల్ని అమ్మేసి ఉండే అవకాశం ఎక్కువ.

అదేంటి ? మాకు తెలియకుండా మమ్మల్ని అమ్మేయడం ఏంటి? అనుకొంటున్నారా ?
అవునండీ ..
మీకు తెలియకుండా మీరు రాబొయ్యే కొనేళ్లల్లో.. మీ బిడ్డ కోసం కట్టబోయే ఫీజు ను, మీ బిడ్డ విద్యను అమ్మేసారు .. అదీ విదేశీ కంపెనీలకు.

హైదరాబాద్ లో కరోనా కాలం తరువాత నడుస్తోన్న ట్రెండ్ ఇదే. హైదరాబాద్.. ఇంటర్నేషనల్ స్కూల్స్ కు, పెద్ద స్కూల్స్ కు ఎప్పటినుంచో ప్రసిద్ధి. గత మూడు నాలుగేళ్లుగా విదేశీ కంపెనీలు రంగ ప్రవేశం చేసి పెద్ద పెద్ద స్కూల్స్ ను కొనేస్తున్నాయి.

కొండాపూర్ లో ముప్పై ఏళ్లుగా పని చేస్తూ పేరొందిన ఒక ప్రముఖ స్కూల్ ను బ్రిటన్ కు చెందిన ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసింది.

హైదరాబాద్ లోని మరో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ ను హొంగ్ కాంగ్ కు చెందిన ఒక బహుళ జాతి కంపెనీ 1600 కోట్లకు కొనింది.

మైనారిటీ వర్గానికి చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమార్తె రెండు దశాబ్దాల క్రితం బండ్లగూడ లో స్థాపించిన ఒక స్కూల్ ను సింగపూర్ కంపెనీ 400 కోట్ల కు కొనింది.

మాదాపూర్ లో ఇరవై ఏళ్ళ క్రితం ప్రారంభం అయ్యి మంచి పేరు సంపాదించిన ఒక స్కూల్ ను దాని స్థాపకుడు నిర్వహణ తలనొప్పులు భరించలేక ఒక విదేశీ కంపెనీకు అమ్మేశాడు. ఇదే కంపెనీ మరి కొన్ని పాఠశాలల్ని కొనుగోలు చేసింది. మరిన్ని పాఠశాలలను కొనుగోలుచేసే సన్నాహాలు జరుగుతున్నాయి.

బోయినపల్లి .. సుచిత్ర.. కీసర లాంటి చోట్ల ఉన్న తమ స్కూల్స్ ను యాజమాన్యం ఒక విదేశీ కంపెనీకి అమ్మేసింది.

అలాగే జూనియర్ కళాశాలల టేక్ ఓవర్ కూడా పెద్దఎత్తున జరుగుతోంది.

ఇవన్నీ ఏదో  సీక్రెట్ వార్తలు కాదు. పైన ఇచ్చిన హింట్స్ ఆధారంగా మీరు స్కూల్ పేరు టైపు చేసి సోల్డ్ టు .. అని గూగుల్ లో కొడితే వార్తలు మీ ముందు ప్రత్యక్షం. ఇంకా వివరాలు కావాలంటే ఆయా విదేశీ కంపెనీల వెబ్సైట్ లో దొరుకుతాయి.

విదేశీ ఫండింగ్ కంపెనీలకు లాభాలు కావాలి. బైజూస్ లాంటి కంపెనీ కరోనా కాలంలో కలల్ని అమ్మింది. కొన్ని వేల కోట్ల విదేశీ ఫండ్స్ బైజూస్ కు ప్రవహించింది.

ఆన్లైన్ విద్యకు ఇక అంతగా భవిషత్తు లేదని గ్రహించిన విదేశీ కంపెనీలు .. రెగ్యులర్ స్కూల్స్ వైపు దృష్టి సారించాయి. “విద్యలో పెట్టుబడి బంగారు బాతు” అని ఈ కంపెనీలు నమ్ముతున్నాయి.

ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న. “హైదరాబాద్ లో ఏ ఇంటర్నేషనల్ / సిబిఎస్సీ స్కూల్ అమ్ముడు పోయింది? ” అని కాదు. “ఇంకా ఎన్ని మిగిలి వున్నాయి?” అని.

ఉప్పల్ కు దగ్గరలోని ఒక స్కూల్ బేరం కుదరక ఇంకా పాత యాజమాన్యం చేతిలోనే వుంది. బేరసారాలు సాగుతున్నాయి.

తొలి దశలో ఈ విదేశీ కంపెనీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ / సిబిఎస్సీ స్కూల్స్ పైనే ద్రుష్టి సారించాయి.

మరి కొన్ని రోజుల్లో రెండో దశ మొదలు కానుంది. అప్పుడు మధ్య స్థాయి స్కూల్స్ .. చిన్న స్కూల్స్ ను టేక్ ఓవర్ చేస్తాయి.

ఎందుకు అమ్మేస్తున్నారు?

ముప్పై ఏళ్ళు వెనక్కు వెళుదాము. ప్రతి వీధిలో ఒక చిన్న దుకాణం ఉండేది.
షాప్ యజమాని అంగట్లో కూర్చునేవాడు.
వెళితే. పేరు పెట్టి పలకరించేవాడు.
డబ్బు లేదంటే అప్పు ఇచ్చేవాడు.
మనిషి అందుబాటులో ఉండేసరికి మనందరికీ లోకువ అయిపోయాడు. గీచి గీచి బేరం ఆడేవారం. నాణ్యత బాగాలేదు అనే వారం.

పాపం.. కాలగమనంలో దుకాణం నడిపే .. శెట్టి గారు/ సేథ్ మాయం అయిపోయాడు.

అదే మనం..
ఇప్పుడు హైపర్ మాల్స్.. సెంట్రలైజడ్ ఏసీ. ఫ్యాషన్ దుస్టులు ధరించిన సేల్స్ బాయ్స్ గర్ల్స్. హైటెక్కు సోకులు

ఆ ఖర్చులు ఎవరి జేబు నుంచి ? కొనుగోలు దార్ల నుంచి కాక ఇంకెక్కడినుంచి వస్తాయి ?

అంటే రూపాయి సరుకు.. ఏసీ ఖర్చులు.. మాల్ అద్దె.. ఇలా అన్ని కలిపి తడిచి మోపెడయ్యింది.

అయిదు వందలు ఒరిజినల్ ప్రైస్. పది పైసలు తగ్గింపు అంటే అదే భాగ్యం అనుకొని మనం కిక్కురుమనకుండా కొనుగోలు చేసి బయటకు వస్తున్నాము. బేరాలు లేవు .. మాటలు లేవు .. మాట్లాడుకోవడాలు లేవు.

చందా పేరుతొ నిన్నటి సేథ్ ను బెదిరించిన లోకల్ గ్యాంగ్ లు ఇప్పుడు మాల్స్ కు పోలేవు. వెళ్లినా పైసా రాలదు.

స్కూల్స్ ను స్థాపించిన వారందరూ మహనీయులు.. ఎలాంటి దోపిడీ జరగలేదు అని కాదు .. కానీ నిన్న మొన్నటి దాక స్కూల్ స్థాపించి నడిపిన వారు ఒక తరం. స్కూల్ నడపాలని పాషన్ వున్నవారు.

స్కూల్ నడపడం ఎన్నో చిక్కులతో కూడుకొన్న వ్యవహారం. అందులో స్కూల్ స్థాపకుడు అందుబాటులో ఉంటే నిన్నటి వీధి చివరి దుకాణం సేథ్ కు ఎదురయినట్టే ఎన్నో ప్రశ్నలు. ఏది ఏమైనా నడుపుతూ వచ్చారు.

వీరిలో ఎక్కువ భాగం ఇప్పుడు.. యాభై అరవైలలో అడుగుపెట్టారు.

వారి రెండవ తరం ఈ జంజాటం తమకు ఎందుకు? అని అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడింది.
“నిర్వహణ తలనొప్పులు ఎందుకు? ఒక్క సారిగా ఇన్ని కోట్లు వచ్చేస్తోంది.. అమ్మేస్తే తలనొప్పి వదులుతుంది” అని మెజారిటీ భావిస్తున్నారు.

విదేశీ కంపెనీలకు రూపాయి పెట్టి.. అయిదు రూపాయిలు లాగడం.. చీజ్ తో పెట్టిన విద్య .

వెనుకటి తరం తల్లితండ్రుల సంగతి వేరు. నిన్నటి కార్పొరేట్ పాటశాలల్లో చదివిన వారే నేటి తల్లితండ్రుల్లో అధిక శాతం.

చదువంటే తెలియదు. ఇంగిత జ్ఞానం లేదు. సామజిక తేలితేటలు సున్నా .. తమ పిల్లల స్కూల్ ను తమ స్టేటస్ సింబల్ గా భావించి బిల్డ్ అప్ లు ఇచ్చుకునే రకం నేడు కోకొల్లలు.

వీరికి కావాల్సింది బ్రాండ్. ఐబి కరికులం .. సీబీఎస్సీ .. పది ఎకరాల్లో స్కూల్ .. క్రికెట్ టెన్నిస్ ఫుట్ బాల్ గ్రౌండ్స్
ఇలా బ్రాండింగ్ ఉంటే చాలు .. కిట్టి పార్టీలలో అమ్మలు  మందు పార్టీల్లో అయ్యలు .. తమ పిల్లాడి బ్రాండెడ్ స్కూల్ ఇది అని గర్వంగా చెప్పొకొంటే .. మిగతా వారు ఈర్శగా చూస్తే .. హా .. ఆ కిక్కే .. వేరు.

బౌరంపేట్ ప్రాంతంలో ఒక పాత స్కూల్ సీబీఎస్సీ క్యాంపస్ ను ప్రారంభించింది. ఒకటో తరగతిని, రెండో తరగతిని కలిపి కూర్చోపెడుతున్నారు. అలాగే ఆరో తరగతి వరకు. తక్కువ మంది టీచర్ లైతే … జీతం తక్కువ అని యాజమాన్యం భావిస్తోంది.

అనేక ఇంటర్నేషనల్ పాఠశాలల్లో ప్రతి పాఠానికి వీడియో ఆన్ చెయ్యాల్సిందే. దీని వల్ల టీచర్ కు పాఠం రాకున్నా ఫరవాలేదు అని యాజమాన్యం ఆలోచన. మన పిల్లలకు లేటెస్ట్ గాడ్జెట్స్ తో పాఠాలు చెబుతున్నారని పేరెంట్స్ హ్యాపీ.

“రోజులో అయిదు గంటలు వీడియోస్ .. ఆ దెబ్బకు మా కళ్ళు పోతున్నాయి. అవసరం అయినా చోట ఒకే. కానీ మంచి టీచర్లు లేకపోయినా పాఠం నడిపేలా చేసందుకు ఈ మోసం .. పిల్లల కంటి చూపు పోగొట్టిన పాపం మాకెందుకు?” అని కొంతమంది టీచర్స్ ఆ పాఠశాలను వదిలేసారు.

ఆక్టివిటీస్ ఆధారంగా పాఠాల్ని చెబితే పిల్లలకు పాఠాలు అర్థం అవుతాయి. పిల్లల కోసం యాక్టివిటీస్. కేవలం షో ఆఫ్ కోసం అయితే?

“తరగతి గదిలో అవసరం అయినవి కానివి తెచ్చి గోడలు నోటీసు బోర్డులు గడ్డీగాదంతో నింపడం .. పేరెంట్స్ ను మోసం చెయ్యడం” కేంబ్రిడ్ కర్రీకులం పాఠశాలను వదిలిపెట్టాలి అనుకొన్న ఒక టీచర్ ఈ రోజు చెప్పిన మాటలు.

సొమ్ము రాబట్టాలంటే సోకు చెయ్యాలి. పిల్లలకు మొబైల్ ఆధారంగా హోమ్ వర్క్ ఇవ్వడం .. ఇంటర్ నెట్ ఆధారంగా రీసెర్చ్ చెయ్యాలి అని చెప్పడం.

పాఠశాలనుంచి ఇంటికి వచ్చిన మూడో క్లాస్ పిల్లాడు .. మమ్మీ స్కూల్ నుంచి నీ వాట్సాప్ కు హోమ్ వర్క్ వచ్చిందా?” అంటాడు. మమ్మీ చూపుతుంది.

అందులోని అంశాలను తన కొడుకు గూగుల్ చేస్తుంటే తల్లి ఆనందానికి అవధులు వుండవు.” మోడరన్ ఏజ్ .. మోడరన్ గాడ్జెట్స్ .. తన బాల్యంలో పదో తరగతిలో కూడా చదవని అంశాలు తన కొడుకు ఐబి కరికలుంలో మూడో తరగతిలోనే చదివేస్తుంటే మురిసి పోయే ఆ తల్లికి … ఆ బిడ్డ మానసిక శారీరిక ఆరోగ్యం ఎంత దారుణంగా దెబ్బతింటుందో చెప్పేదెవరు?

రెండు రూపాయిల బి సి డి విటమిన్ మాత్రలు వేసుకొంటే ఇంట్లో పల్స్ ఆక్సీ మీటర్ పెట్టుకొంటే పొయ్యేదానికి  కరోనా పేరుతొ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి లక్ష ఖర్చు పెట్టి రెండిసివెర్ ఇంజెక్షన్లు వేసుకొని అటుపై సిటి స్కాన్  ఐసీయూ అని లక్షలు ఖర్చుపెట్టుకొని, అదో రకం తుత్తిని అనుభవించి .. అది చాలక అటుపై వాక్సీన్ వేసుకొని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నవారు నేటి సమాజం లో కోట్ల కొద్దీ.

వీరు .. బి సి డి విటమిన్ మాత్రలు వైద్యాన్ని వెక్కిరించినట్లే .. ఎవరైనా స్కూల్ ఎలా ఉండాలో చెబితే ..” మీది పనికి రాని స్కూల్. కాలం చెల్లిన విధానం .. మాది గొప్ప స్కూల్” అని టెక్కులు పోతారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ!

అదిగదిగో .. అలాంటి టెక్కుల తల్లితండ్రులు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. వారిని బ్రాండ్స్ పేరుతొ .. హై టెక్కు హంగులతో బురిడీ కొట్టించవచ్చు .. కోట్లు గడించవచ్చు అనే నమ్మకంతో విదేశీ కంపెనీలు రంగప్రవేశం చేసాయి.

అన్నట్టు తెలుగు వారి రెండు కార్పొరేట్ బ్రాండ్లలో ఒకటి ఇప్పుడు బలహీన పడింది. తాము స్కూల్/కాలేజీ నడుపుతున్న బిల్డింగ్స్ గత నెల అద్దె ఇంకా చెల్లించలేని స్థితిలో ఒక సంస్థ. జనాలు సిబిఎస్సీ బ్రాండ్ అయితేనే పడుతారు అని అలాంటి స్కూల్స్ స్థాపనలో మరొకటి.

జూనియర్ కాలేజీ రంగంలో ఉత్తర భారత విద్య సంస్థలు వచ్చాయి. పాతుకొని పోతున్నాయి.

మీ దగ్గర అయిదు వందల కోట్లు ఉన్నాయా? అయితే మంచి ఏరియాలో రెండు ఎకరాల్లో సిబిఎస్సీ పాటశాల ప్రారంభించండి. తలకిందులు పడి రెండు – మూడేళ్లు నడిపి పేపర్ పై ఎలాగో ఒకలా లాభాలు చూపించండి. నాలుగో ఏడాది రెండు వేల కోట్లకు స్కూల్ ను అమ్మేసి అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోండి.

ఈ లోగా బైజూస్ బుడగ పగిలినట్టే ఈ విదేశీ విద్యా కంపెనీల బుడగ పగిలితే పొతే అంటారా?

ఆన్లైన్ బుడగ త్వరగా పగిలింది. ఇవి రెగ్యులర్ స్కూల్స్ కదా. అంత ఫాస్ట్ గా పగలదు. కనీసం కొనేళ్లు పడుతుంది.
నిజమే అట్టే టైం లేదు. త్వరగా స్టార్ట్ చేసి త్వరగా బేరం పెట్టేయండి.

ఇక నేటి తరం బ్రాండ్ కాన్షియస్ తల్లితండ్రుల సంగతి అంటారా?
ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్.. క్రొకోడైల్ ఫెస్టివల్.
అప్పుడు తూరుపు తిరిగి దండం పెట్టడమే.

Related posts