ఏపీ మంత్రి నారా లోకేశ్ నేడు ప్రచారంలో భాగంగా సభకు వెళుతూ విశాఖపట్టణంలో ‘అన్న క్యాంటీన్’ చూశానని, చాలా పెద్ద లైన్ ఉందని, ఆ లైన్ లో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ఐదు రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదని, అలాంటిది, ఈ క్యాంటీన్ లో కేవలం ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నామని అన్నారు.
దేశంలో కూడా ఇంకెక్కడా జరగనటువంటి అభివృద్ధి ఒక్క ఏపీలోనే జరిగిందని, దీని కంతటికి కారణం సీఎం చంద్రబాబేనని లోకేష్ ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టనివ్వకూడదని, విభజన ద్వారా ఏపీకి వచ్చిన ముంపు మండలాలను తిరిగి తీసుకోవాలని కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకూ తన ఆటలు సాగవని కేసీఆర్ కు తెలుసని, అందుకే, బలహీనుడైన జగన్ ని సీఎం చేయాలని చూస్తున్నారని అన్నారు.