ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ఐదోరోజు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చకు టీడీపీ నేతలు పట్టు పట్టారు.
తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనతో వాయిదా వేశారు. చర్చ జరపకుండా ప్రతిరోజు టీడీపీ సభకు అడ్డుపడుతోందంటూ వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కాగా..పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకూ 18 మంది మృతి చెందారు. ఈ అంశంపై చర్చ జరగాలని టీడీపీ నేతలు కోరుతున్నా, అసెంబ్లీ స్పీకర్, చైర్మన్ అందుకు అంగీకరించకపోవడం విపక్ష నేతలు ఆందోళనకు దిగారు.