హైదరాబాద్ షాద్నగర్ ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని కొందరు అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఇంత క్రూరమైన దుశ్చర్య తనను కలచివేసిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హంతకులకు సమాజంలో జీవించే హక్కు లేదని మండిపడ్డారు.
ప్రతి తల్లిదండ్రులూ తమ అబ్బాయిలను జాగ్రత్తగా పెంచాలని అన్నారు. మహిళలను గౌరవించే విషయంలో, సమానత్వంలో చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో లైంగిక విద్య, లింగ సమానత్వంపై అవగాహన కల్పించాలని చెప్పారు. తద్వారా ఈ తరహా ఘటనలను నివారించవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాఠశాల స్థాయి నుంచే ఇది మొదలవ్వాలని, ప్రతి ఒక్కరూ మార్పు కోసం పాటు పడాలని సూచించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్లు పెట్టారు.