టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి మంత్రి అనిల్ కుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఇవాళ కొత్తగా పొత్తుల గురించి మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. చంద్రబాబు అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా పొత్తు పెట్టుకోగలరని దుయ్యబట్టారు.
పొత్తు లేనిదే చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయలేరంటూ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన ఇలా అన్ని పార్టీలు అయిపోయాయని అన్నారు. సీఎం జగన్ సింహం లాంటివాడని, ఆయన నాయకత్వంలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు.
2024లో కూడా తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని అనిల్ పేర్కొన్నారు. వైసీపీ పొత్తుల కోసం చూసే పార్టీ కాదని స్పష్టం చేశారు. 2024లో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా? అని మంత్రి సవాల్ విసిరారు.