రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పనకోసం చర్చించడానికి 27 జూన్ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో ప్రారంభం కానున్న అఖిల పక్ష సమావేశం సుధీర్ఘంగా సాగనున్నది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. లంచ్ అనంతరం సమావేశం రోజంతా కొనసాగనున్నది.
దళిత ప్రజాప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ప్రతిపక్ష ఎం ఐ ఎం ., కాంగ్రేస్, బిజెపి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొంటారు.
వీరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి. సిపిఐ, సిపీఎం పార్టీలనుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీ అధ్యక్షులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభధ్రం లకు సిఎం కేసిఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అదే విధంగా దళిత సమస్యల పట్ల అవగాహన వుండి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను కూడా ఆహ్వనించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.
ఈ సమావేశం సందర్భంగా..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ., సిఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.
‘‘ నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం అభివృద్ధికోసం పాటుపడుతున్నది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని మారుమూలన ఉన్న దళితుల జీవితాల్లో గుణాత్మకంగా అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం గురించి ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం కూర్చోని మరింత క్షుణ్ణంగా చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామ’’ ని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.

