బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘మిషన్ మంగళ్’ ప్రచార కార్యక్రమాలతో భాగంగా చంద్రయాన్-2 బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని జులై 22 ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతోంది. అలాగే మిషన్ మంగళ్ చిత్రానికి, ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు ఇస్రో బృందం తరఫు నుంచి ఆల్ది బెస్ట్’ అని ఇస్రో ట్వీట్ చేసింది. దానిపై స్పందించిన అక్షయ్ కుమార్ ‘కృతజ్ఞతలు, చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో బృందానికి మరోసారి బెస్ట్ ఆఫ్ లక్’ అని ఆయన సమాధానం ఇచ్చారు.
భారత శాస్త్రవేత్తల బృందం మార్స్ ఆర్బిటార్ మిషన్ను అంగారకుడి మీదకు పంపించడంలో చేసిన కృషి నేపథ్యంలో మిషన్ మంగళ్ చిత్రం తెరకెక్కింది. దానికి సంబంధించి జులై 18న విడులైన ట్రైలర్కు అభినందనలు వెల్లువెత్తాయి. గతంలో విడుదలైన ఫస్ట్ టీజర్పై ఇస్రో స్పందిస్తూ..‘ఒకే దేశం, ఒకే కల. భారత్ అంతరిక్షంలో సూపర్ పవర్గా మారనుంది. కొద్దిరోజుల్లో మరో మైలురాయిని దాటనుంది!’ అని వ్యాఖ్యానించింది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని జులై 14నే నిర్వహించాలని ఇస్రో మొదట భావించింది. కొన్ని సాంకేతిక కారణాలతో దాన్ని జులై 22కు వాయిదా వేసింది. మిషన్ మంగళ్ చిత్రం విషయానికొస్తే..అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు జగన్ శక్తి దర్శకత్వం వహించారు. విద్యాబాలన్, తాప్సి, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్, శర్మాన్ జోషి, కీర్తి కుల్హరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.