ఎన్నికల సమయం దగ్గర పడడంతో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రతి రోజు ఇరు ప్యానల్స్కు చెందిన సభ్యుల నుంచి ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. బుధవారం సినీ నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్, నటి కరాటే కల్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్కు లేఖ రాశారు. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని మండిపడుతున్నారు. వాట్సాప్ గ్రూప్ మధ్య జరిగిన సంభాషణే ఇందుకు కారణం. దాని వెనుక చాలా మతలబు ఉన్నట్లు తెలుస్తోంది.
మా ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేసిన హేమ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ..నిన్న నాపై కుమారి కరాటే కల్యాణి, వి.నరేశ్లు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారు. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఈ విషయమై నేను సైబర్సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు తగ్గాయి. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని కల్యాణి ప్రస్తావిస్తూ ‘నేను పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను ముందుగా సోషల్మీడియా నుంచి తొలగించమని సలహా ఇచ్చినట్లు’ వ్యాఖ్యానించారు. కల్యాణి వ్యాఖ్యలను నరేశ్ కూడా సమర్థించారు.
నేను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తాజా వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా అందుకు ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని బెదిరించారు. నరేశ్ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉంది. నాపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. మా ఎన్నికల ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావటమే కాకుండా, కొందరు సభ్యులు కూడా వీరి ధోరణిని అనుసరించే ప్రమాదం ఉంది. అందువల్ల వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకొమ్మని కోరుతున్నా. కృతజ్ఞతలతో హేమ.”
వై .సి .పి నాయకులను మూసుకొని కూర్చోమని చెప్పలేరా ?