తమిళనాడులోని కళ్లకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రభు (34) చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులోనే అన్నాడీఎంకే నుంచి అమ్మ జయలలిత ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభు అందరి దృష్టిని ఆకర్షించాడు. తన నియోజకవర్గంలోని త్యాగ దుర్గం మలై కోటైకి చెందిన సౌందర్య ప్రేమలత అనే యువతితో ఎమ్మెల్యేకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆమె ఓ అర్చకుడి కూతురు కాగా ఎమ్మెల్యేది మరో కులం. దీంతో కులాంతరం కావడం, అమ్మాయి వయసు 19 ఏళ్లే కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పు కోలేదు. దీంతో తన ఇంట్లో, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు ఎమ్మెల్యే. ఈ పెళ్లి సంగతి తెలుసుకున్న అమ్మాయి తండ్రి పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమయింది.