గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కంటితడి పెట్టారు. పేకాట ఆడిస్తున్నానంటూ తప్పుడు కథనాలను రాస్తున్నారని అన్నారు. పేకాట ఆడుతూ దొరికిన వారిని విడిచిపెట్టాలని తాను పోలీసులకు ఫోన్ చేసి చెప్పాననే వార్తల్లో నిజం లేదని చెప్పారు. నంబూరు గ్రామంలో జరిగిన పేకాటతో శ్రీదేవికి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. మీడియా కథనాలపై ఆమె స్పందిస్తూ పేకాటతో తనకు సంబంధం లేదని చెప్పారు.
నంబూరు గ్రామం తన నియోజకవర్గంలోకి రాదని తెలిపారు. ఈ కథనాలు తనను ఎంతో బాధిస్తున్నాయని కన్నీరు పెట్టారు. పేకాట అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు.తన గురించి ఏ ఛానల్ అయినా తప్పుడు వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహిళ అని కూడా చూడకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి మండిపడ్డారు. ఏదైనా రాసే ముందు నిజాలు తెలుసుకోవాలని చెప్పారు.