ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే. అయితే ఎర్రకోటను ముట్టడి చేయడం వెనుక దాగున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముట్టడిలో పంజాబ్ సింగర్ దీప్ సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సింగర్ దీప్ సిద్దూ ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది. అతని చివరి లొకేషన్ హర్యానాలో ఉన్నట్లు గుర్తించారు. ఎర్రకోట ముట్టడి ఘటనలో దీప్ సిద్దూపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొట్టారని సిద్దూపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పంజాబీ నటుడు దీప్ సిద్దు అచూకీ చెబితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ఢిల్లీ పోలీసులు బుధవారం ప్రకటించారు. రైతుల నిరసనలో భాగంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండలో పాల్గొన్న మిగిలిన నలుగురి ఆచూకీ చెప్పిన వారికి రూ. 50 వేలను రివార్డును ఇస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎర్రకోటపై సిక్కు పతాకాలను ఎగురవేసిన దీప్ సిద్దూ, జుగరాజ్ సింగ్, మరో ఇద్దరి ఆచూకీ చెబితే లక్ష రూపాయల నడదు బహుమతులు ఇస్తామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.