ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూరు సమీపంలోని బిక్రూ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్ అనంతరం గ్యాంగ్స్టర్ వికాశ్ దూబే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం 100 ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో దూబే కోడలు షమా, పొరుగింటి వ్యక్తి సురేశ్ వర్మ, పనిమనిషి రేఖలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల రైడ్ గురించి గ్యాంగ్స్టర్కు ముందే సమాచారం అందించిన పోలీసులపై వేటు పడింది. చౌబేపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు ఎస్సైలు కున్వర్ పాల్, కేకే శర్మతోపాటు కానిస్టేబుల్ రాజీవ్లను సస్పెండ్ చేసినట్టు కాన్పూర్ ఎస్సెస్పీ దినేశ్ కుమార్ తెలిపారు. అంతర్గత విచారణలో వీరి ముగ్గురి పాత్ర ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. సస్పెండ్ చేయడానికి ముందు వారి కాల్ రికార్డులను పరిశీలించినట్టు చెప్పారు.