పీవోకే లో నీలం, జీలం నదులపై అక్రమంగా ఆనకట్టలు నిర్మిస్తున్నారని చైనా, పాకిస్తాన్ పై పీవోకే వాసులు మండిపడుతున్నారు. ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్ వాసులు నిరసనలు చేపట్టారు. చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ రెండు నదులపై ఆనకట్టల కోసం ఏ చట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు.
నీలం జీలం, కోహ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అక్రమ నిర్మాణాలని అన్నారు. వాటిని ఆపే వరకు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్, చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు ఆపే వరకు నిరసనలు కొనసాగుతాయని పీవోకే వాసులు హెచ్చరించారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద పీవోకేలోని జీలం నదిపై హైడ్రో పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు.