తెలంగాణాలో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్నీ వెలువరించలేదని తెలిపింది. తాము కూడా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు ఎలాంటి అనుమతులూ లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపైనా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే, పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని తన ఉత్తర్వులలో ఆమె స్పష్టం చేశారు.