ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ఢిల్లీలోని తన ఇంటికి చేరుకున్న గబ్బర్.. గురువారం వాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా మహమ్మారి సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు తెలియజేశాడు. వీలైనంత త్వరగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకొని.. వైరస్ను ఓడించాలని ధావన్ సూచించాడు. శిఖర్ ధావన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘కరోనా వాక్సినేషన్ పూర్తైంది. త్యాగాలు చేస్తూ, అంకితభావంతో ముందు వరుసలో పోరాడుతున్న యోధులకు కేవలం ధన్యవాదాలు మాత్రమే చాలవు. ఏ మాత్రం వెనుకాడకుండా సాధ్యమైనంత త్వరగా మీరు కూడా కరోనా టీకా వేయించుకోండి. వైరస్ను ఓడించేందుకు అది సాయపడుతుంది’ అని గబ్బర్ ట్వీట్ చేశాడు. పలు జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. 29 మ్యాచ్లను మాత్రమే నిర్వహించారు. ఇక 14వ సీజన్లో శిఖర్ ధావన్ అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు అద్భుత విజయాలు అందించాడు. లీగ్ ఆరంభం నుంచీ గబ్బర్ మంచి ఫామ్లోనే ఉన్నాడు.
previous post