పాకిస్థాన్లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో పాక్లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 11,155కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ను మే 9 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రణాళిక, అభివృద్ధిశాఖ మంత్రి అసద్ ఉమర్ తెలిపారు.
కోవిడ్-19 బారి నుంచి 2,537 మంది కోలుకోగా, 237 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో 79 శాతం స్థానికంగా ఒకరి నుంచి ఒకరికి సోకడం ద్వారా వచ్చినవేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.