మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి సొంత పార్టీ వారితో అక్షింతలు వేయించుకున్నాడు. ఏపీసీఎం జగన్ అసెంబ్లీలో రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది అనే అంశానికి గంటా జై కొట్టడమే దానికి కారణం. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. పార్టీ నేతలంతా ముక్త కంఠంతో ఖండించిన అంశాన్ని.. గంటా స్వాగతించారు. పైగా ప్రభుత్వానికి తమ వంతు సహకారమందిస్తామని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. జగన్పై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తుంటే.. టీడీపీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక్క రాజధానినే కట్టలేకపోతున్నామని.. అలాంటప్పుడు మూడు రాజధానులను ఎలా కడతారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మాత్రం జగన్ ప్రకటనకు జైకొట్టడం విశేషం. విశాఖపట్టణాన్ని పరిపాలనా నగరం మార్చే అవకాశముందన్న సీఎం వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు.
విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా మార్చే ప్రకటనను స్వాగతిస్తున్నామని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారుని ట్విటర్లో గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనితో ఆయన తీరును పలువురు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇదేసమయంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.