మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సామాన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా ద్వారా హీరోలందరూ ‘సైరా’ యూనిట్కు విషెస్ తెలియజేశారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. రామ్చరణ్తో ఉన్న విభేదాల వల్లే “సైరా” ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి బన్నీ హాజరుకాలేదని, మెగాస్టార్ సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ బన్నీ ఎట్టకేలకు తన ట్విటర్ ఖాతాలో ఒక లేఖ పోస్ట్ చేశాడు. “సైరా నర్సింహారెడ్డి.. మన మెగాస్టార్ చిరంజీవిగారు నటించిన అత్యద్భుత చిత్రం. తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడే క్షణం. చాలా కాలం క్రితం ‘మగధీర’ చూసినపుడు.. చిరంజీవిగారు కూడా అలాంటి భారీ సినిమాలో నటిస్తే బాగుంటుందనిపించింది. నా కల ఈ రోజు నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవిగారితో ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నిర్మాత, నా బావ రామ్చరణ్కు ధన్యవాదాలు. ఒక తండ్రికి కుమారుడు ఇచ్చిన గొప్ప బహుమతి ఈ చిత్రం. ‘సైరా’ చిత్రబృందానికి శుభాకాంక్షలు. దర్శకుడు సురేందర్ రెడ్డిగారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా ప్రతీ ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను” అని బన్నీ పేర్కొన్నాడు.
previous post