మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సైరాపై కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తమ వంశీకుడి సినిమా చేస్తున్నారు కాబట్టి తమకు 50 కోట్లు చెల్లించాల్సిందే అంటూ ఉయ్యాలవాడ వంశంలోని పాతిక కుటుంబాలు చిరంజీవిని కోరాయి. దీనిపై రామ్ చరణ్ ఇప్పటికే స్పందించాడు. ఒక్కరూపాయి కూడా ఇవ్వనంటూ చెప్పాడు. ఇప్పుడు చిరు కూడా ఇదే మాట అన్నాడు. నిజానికి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు చాలా అమాయకులని చెప్పాడు చిరంజీవి. ఎవరో వాళ్లను కావాలనే రెచ్చగొడుతున్నారని, తమ స్వలాభం కోసం పాపం ఉయ్యాలవాడ కుటుంబాన్ని వాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగాస్టార్. ఆ కుటుంబానిది సాధారణ ఆర్థిక స్థితి ఉందని, అందుకే ఎవరో చెప్పిన మాటలను ఇట్టే నమ్మేసి సినిమాపై తమకు తెలియకుండానే వివాదాలను సృష్టిస్తున్నారని చెప్పాడు చిరంజీవి. వాళ్లకు కానీ.. ఉయ్యాలవాడ పుట్టి పెరిగిన గ్రామానికి కానీ ముందు నుంచి ఏదైనా మంచి చేయాలని నిర్మాత రామ్ చరణ్ అనుకుంటూనే ఉన్నాడని.. కానీ ఇప్పుడు వాళ్లు మాట్లాడుతున్న తీరు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉందంటున్నాడు చిరంజీవి. మేమంతా 25 కుటుంబాలు ఉన్నామని.. ఒక్కో కుటుంబానికి 2 కోట్ల చొప్పున 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. అంత డబ్బు తాము ఎక్కడి నుంచి తెచ్చివ్వగలమని అడుగుతున్నాడు మెగాస్టార్. అయినా 100 ఏళ్లు దాటిన తర్వాత ఎవరి కథైనా చరిత్ర కిందికే వస్తుందని.. దానిపై వారసులకు ఏ హక్కు ఉండదని తేల్చేశారు చిరంజీవి.
previous post