ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట, ప్రాంతీయ స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో టీడీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఓటమిపై స్థానిక నేతల నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గురువారం సత్తెనపల్లిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని భావించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆఫీస్లో టీడీపీ సమావేశం నిర్వహిస్తే తాము హాజరుకామని టీడీపీ నేతలు అంటున్నారు.
సత్తెనపల్లిలో ఉన్న పాత టీడీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు మళ్లీ తెరిచారు. సమావేశాన్ని పాత టీడీపీ కార్యాలయంలోనే జరపాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోడెల ఆఫీసులో సమావేశానికి హాజరుకాకూడదని టీడీపీ నేతలు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కోడెల కుమారుడు, కుమార్తెపై జిల్లాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడెల ఆఫీస్లో సమావేశం నిర్వహించకూడదని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.