నిఘావర్గాలు ఏపీలో కి సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించారని హెచ్చరించాయి. దీనితో అప్రమత్తమైన ఏపీ పోలీసులు అన్ని జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. హోటళ్లు, లాడ్జీల్లో కొత్తవారు దిగితే వెంటనే సమాచారం అందించాలని యాజమాన్యాలను ఆదేశించారు. అలాగే నగరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా నౌకాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశముందన్న సమాచారంతో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పన్నపూడి పాతవూరు సమీపంలో మత్స్యకారులకు ఓ పడవ లభ్యమయింది. ఆ బోటుపై శ్రీలంక అని రాసి ఉంది. దీని తో జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీలంకలో ఐసిస్ అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి 258 మందిని చంపేశారు. దీనితో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులే భారత్ లోకి ప్రత్యేక బోట్ ద్వారా ప్రవేశించి ఉంటారని నిఘావర్గాలు హెచ్చరించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే కోస్ట్ గార్డ్ దళాలను అప్రమత్తం చేశారు. శ్రీహరికోటలో భద్రతను భారీగా పెంచారు.