ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఈ రోజు యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. తమ న్యాయసమ్మతమైన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.
కార్మికుల వేతన సవరణ, బకాయిల చెల్లింపు, అద్దెబస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యల నిలుపుదల సహా 26 డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదని తెలిపారు. సమ్మె తేదీ గడువు పెంచాలన్న అధికారుల ప్రతిపాదనను జేఏసీ తిరస్కరించింది. ఈ నెల 13 నుంచి 53,500 మంది ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు వెళతారు. ఈ నెల 9 నుంచి కార్మికులు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఇకపై డబుల్ డ్యూటీలు చేయరని సంఘాలు స్పష్టం చేశాయి.