వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడపకు చేరుకున్నారు. ఈ ఉదయం కలియుగ దైవం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ హరికిరణ్, పోలీసు సూపరింటెండెట్ అభిషేక్ మహంతి, కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ జగన్ కడపలోని అమీన్పీర్ దర్గాకు చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దర్గా పెద్దలు, మౌలాలు జగన్కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కాషాయ తలపాగాను చుట్టి ఆహ్వానించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న జగన్.. దర్గాకు పూల ఛాదర్ను సమర్పించారు. అక్కడి నుండి జగన్ పులివెందులకు బయలుదేరారు. పులివెందులలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొననున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గండిలో వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాకిస్థాన్ గడ్డపై 40 వేల మంది టెర్రరిస్టులు ట్రైనింగ్: ప్రధాని ఇమ్రాన్