తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదల కోసమేనని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం బాసర మండలం బిద్రెల్లిలో టీఆర్ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా అల్లోల ముమ్మరం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా ఫించన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా ధీమాగా ఉన్నారని గుర్తు చేశారు.
ప్రతి కుటుంబానికి పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రైతుల కోసం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మణం త్వరలో పూర్తి అయి కోటి ఎకరాలకు సాగునీరందబోతుందని అన్నారు. రైతును రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్ట్ లను చేపట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు పూర్తిగా ప్రజాదారణ కోల్పోయి తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.