కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీ శాసన సభాపక్షాన్ని(సీఎల్పీ) టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలంటూ కోరితే తమకు తెలియజేయాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కోరారు.
భారత రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్కు లేదన్నారు. ప్రాంతీయ పార్టీలో ఒక జాతీయ పార్టీ విలీనం కావడం ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా చూశారా అంటూ ఆయనను ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభ స్పీకర్ కావడాన్ని యావత్ శాసనసభ్యులూ హర్షించారని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవడానికి కాంగ్రెస్ శాసనసభాపక్షమూ సహకరించిందన్నారు.