నిబంధనలను పట్టించుకోకుండా ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. లేఖను తీసుకుని ఇప్పటికే టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, జూపూడి ప్రభాకర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం రాసిన లేఖను ఈసీకి అందజేయనున్నారు. ఈసీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కుట్రలో ఈసీ భాగస్వామ్యం కావడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిఘా విభాగం బాస్ ఏబీ వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు ఎస్పీలను ఎన్నికల కమిషన్ రాత్రికి రాత్రి బదిలీ చేసింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆయా శాఖల్లో అసహనం వ్యక్తమవుతోంది.