తన తండ్రి హత్య కేసు దర్యాప్తులో అనేక అనుమానాలు ఉన్నాయని వైఎస్ వికానందరెడ్డి కూతురు సునీతారెడ్డి ఆరోపించారు. హైద్రాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ నాన్న చనిపోయిన విషయం ఉదయం 6.40కి సమాచారం ఇచ్చామని, డెత్ స్పాట్లో ఏం జరిగిందో పులివెందుల సీఐకి అన్నీ తెలుసు అని సునీతారెడ్డి పేర్కొన్నారు. జగనన్న సీఎం కావడానికి, అవినాష్ రెడ్డి మరోసారి ఎంపీగా అయ్యేందుకు నాన్న చాలా కష్టపడుతున్నాడని ఆమె వివరించారు.
ఈ నెల 14వ తేదీన ఆసుపత్రిలో చేరిన పరమేశ్వర్ రెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ఛాతీ నొప్పి పేరుతో పరమేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చేరారని ఆమె చెప్పారు. ఈ నెల 15వ తేదీన ఉదయమే ఎవరో ఓ వ్యక్తి వచ్చి ఫోన్లో పరమేశ్వర్ రెడ్డికి ఏదో చూపించాడని ఆమె తెలిపారు. జమ్మలమడుగులో తన తండ్రికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు. తన తండ్రి లేకపోతే టీడీపీ విజయావకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి తన తండ్రిని హత్య చేసి ఉంటారని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. సిట్ బృందం అడిగిన ప్రతీ సమాచారాన్ని తాను ఇచ్చినట్టు ఆమె తెలిపారు.