కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలో వరంగల్ యువకుడు గోవింద్ అజయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అజయ్ అల్లర్లకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు.
ఈ క్రమంలో తనపై కేసులు పెడతారేమోనని భయపడిన అజయ్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అజయ్ పేరెంట్స్.. అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా అజయ్.. వాట్సాప్ మెసేజ్ రావడం వల్లే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. తాను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ ఫైరింగ్ జరిగినట్టు తెలిపాడు. ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు.
ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అప్లై చేశానన్నాడు. ఆందోళనల్లో భాగంగా కేసు అయితే ఉద్యోగం రాదనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు.