పాకిస్తాన్ ఆర్మీ అదుపులో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ రాక కోసం యావత్ భారతం ఎదురుచూస్తోంది. కమాండర్ అభినందన్ వర్థమాన్ను పాక్ అధికారులు ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్కు అప్పగించారు. ఇవాళ మధ్యాహ్నం 3-4 మధ్య ఆయన అట్టారీ-వాఘా జాయింట్ చెక్పోస్టు మీదుగా స్వదేశంలో అడుగుపెట్టనున్నారు. అభినందన్కు స్వాగతం పలకడానికి భారత బలగాలు వాఘా సరిహద్దు వద్ద ఏర్పాట్లు చేశాయి. భారీగా పంజాబ్ పోలీసు బలగాలను అక్కడ మొహరించారు. ఈ క్రమంలోనే అభినందన్ కు స్వాగతం పలికేందుకు అతని తల్లిదండ్రులు వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. అభినందన్ను చూసేందుకు వందలాది మంది వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు.
ఇటీవల పాక్ యుద్ధ విమానాలు భారత్ గగనతలంలోకి ప్రవేశించిన విషయాన్ని గమనించిన అభినందన్ మిగ్ విమానంతో పాక్ విమానాన్ని వెంటాడాడు. ఈ సందర్భంగా పాక్కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. జనీవా ఒప్పందం ప్రకారం ఆయనను వెంటనే బేషరతుగా స్వదేశానికి తిప్పి పంపాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు పాక్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ అభినందన్ను విడుదల చేస్తామని ప్రకటించారు.