*సీఎం జగన్తో ప్రభుత్వం సలహాదారు సజ్జల మరోమారు భేటి
*మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతోంది
*పాత, కొత్త కలయికగా కేబినేట్ ఉంటుంది..
*అన్ని అంశాలను సీఎం పరిగణనలోకి తీసుకుంటారు..
* రేపు మధ్యాహ్నం వరకు కొత్త మంత్రులు జాబితా..
పాత, కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది. శుక్రవారం రాత్రి సుమారు మూడు గంటల పాటు సీఎంతో సమావేశమైన సజ్జల.. శనివారం మరోసారి భేటీ అయ్యారు.
భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని.. అన్ని అంశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు సజ్జల తెలిపారు
అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. లిస్ట్ ఫైనల్ అయ్యాక కాబోయే మంత్రులకు ఆదివారం ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తామన్నారు.
ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని.. జగన్ టీమ్లో పనిచేస్తున్నందుకు ఎమ్మెల్యేలు హ్యాపీగానే వున్నారని సజ్జల పేర్కొన్నారు. కేబినెట్లో బీసీలకు, మహిళలకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. రాజీనామాలు అందరివీ గవర్నర్ వద్దకు వెళ్తాయని, మళ్లీ కొత్తగా ప్రమాణ స్వీకారం ఉంటుందని సజ్జల తెలిపారు.
రేపు మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు సీల్డ్ కవర్ లో జాబితా పంపనున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు..కొత్త మంత్రివర్గం జాబితా దాదాపుగా సిద్ధమయిందని తెలుస్తోంది. కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకునేవారితో పాటు కొనసాగించే వారి పేర్లను కూడా గవర్నర్ వద్దకు పంపనుంది ప్రభుత్వం . ఈ జాబితాలో ముగ్గురు మంత్రులు మాత్రం ఖచ్చితంగా వుంటారని వార్తలు వస్తున్నాయి. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
బాబు అవినీతి పాలనపై ఒక్క పుస్తకం అయినా వేశారా?: అంబటి