గ్రామాలలో ఎప్పటి నుండో లోకల్ గవర్నెన్స్ ఉన్నదే. అయితే అప్పటిలో అది పెద్దలకు మాత్రమే కలిసొచ్చే పాలన. అటువంటివి ఈ కాలంలో కూడా కొనసాగుతుండటం విచారకరం. ఇది ప్రభుత్వం గ్రామాలలోకి ఎంతవరకు వెళ్లిందనేది తెలిసిపోతుంది. తాజాగా, అనంతపురంలో ఆటవిక చర్య పట్టపగలు దర్శనమిచ్చింది. చుట్టూ వందమందికిపైగా ఉన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన పాపాన పోలేదు. గుమ్మఘట్ట మండలంలోని కేపీదొడ్డి గ్రామానికి చెందిన ప్రేమజంట పది రోజుల క్రితం ఊరి విడిచి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల తల్లిదండ్రులు వారిని పిలిపించి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అది అమానవీయంగా తయారైంది. గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప చెలరేగిపోయాడు.
పంచాయితీ పెద్ద ఆమెను కొడుతూ, పెద్దల మాట విననంటావా అంటూ కర్రతో రెచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే బాలిక చెంపలు చెడామడా వాయించాడు. అక్కడితో ఆగకుండా కర్రతో గొడ్డును బాదినట్టు బాదుతూ, కాళ్లతో బాలిక గుండెలపై తంతూ వీరంగమేశాడు. యువకుడిపైనా, బాలిక తండ్రిపైనా తన ప్రతాపం చూపించాడు. పంచాయితీకి వచ్చిన ఇతర పెద్దలు, చుట్టూ వున్న వందమంది జనం సినిమా చూస్తున్నట్టు చూశారు. లింగప్ప శివాలెత్తడం మీడియాకెక్కడంతో ఈ కిరాతకం వెలుగుచూసింది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయింది. ఇంత జరిగినా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, అసలు తమ దృష్టికే రాలేదని పోలీసులు చెబుతుండడం అందరినీ షాక్కు గురిచేస్తోంది.