మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని సింగరేణి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు అసిస్టెంట్ మేనేజర్ తేజ, సెఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు
ప్రమాదం ఎలా జరిగిందంటే..
బొగ్గుగనిలో సపోర్టుగా ఏర్పాటుచేసే పిల్లర్ తొలగించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గనుల్లో ఒత్తిడి తట్టుకునేందుకు బొగ్గు తవ్వే మార్గంలో పైకప్పునకు దన్నుగా పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. అడ్రియాల గనిలో 86 నుంచి 87 లెవల్ వరకు ఉండాల్సిన మూడు పిల్లర్లలో.. మధ్యలో ఉన్నదాన్ని తొలగించారు.
దీంతో పైకప్పు ఒత్తిడికి గురై 20 రోజుల క్రితం పడిపోయింది. కూలిన ప్రాంతాన్ని సరిచేసేందుకు పనులు చేపట్టిన కొద్ది గంటల్లోనే.. మళ్లీ కూలి సిబ్బందిపై పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది.