శ్రీలంక రాజధాని కొలంబో ఎంతో పవిత్రమైన ఈస్టర్ పండుగ రోజు రక్తసిక్తమైంది. కొలంబో నగరం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. మూడు చర్చ్ లు, రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో సుమారు 137 మంది వరకు మృతి చెందగా, 200 మందివరకు క్షతగాత్రులు కాగా, మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
పేలుడు తొలుత బట్టికలోవా ప్రాంతంలోని ఓ చర్చ్ లో సంభవించింది. ఆపై, హోటల్ షాంగ్రీ లా, హోటల్ సినామోన్ గ్రాండ్ లో కూడా పేలుళ్లు చోటుచేసుకునాన్నాయి. ఆపై సెయింట్ ఆంథోనీ ప్రార్థనామందిరం, సెయింట్ సెబాస్టియన్ చర్చ్ ల్లోనూ విస్ఫోటనం జరిగింది. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనల్లో ఉండగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాలు క్షతగాత్రులతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి ముఖ్యంగా, ఓ వ్యక్తి కదలిక లేకుండా పడివుండగా, పక్కనే ఓ చిన్నారి అత్యంత దీనంగా ఏడుస్తున్న దృశ్యం .. అందరినీ కలచివేస్తోంది.