*తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్
*సీసీపుటేజీ ఆధారంగా ఎంక్వ్కేరీ..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కిడ్నాప్ కలకలం రేగింది. శ్రీవారి ఆలయం సమీపంలో ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..
తిరుపతి సమీపంలోని దామినేడుకు చెందిన మహిళ తిరుమలలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె కొడుకు ఐదేళ్ల గోవర్దన్ రాయల్ శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా ఆదివారం కిడ్నాప్కు గురయ్యాడు.
అయితే బాలుడి ఆచూకీ లభించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసినట్టుగా గుర్తించారు. ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బాలుడు తప్పిపోగా రాత్రి 7:11 గంటలకు బాలుడిని తీసుకుని మహిళ తిరుమల నుంచి తిరుపతికి పారిపోయింది.
అనంతరం మహిళ తిరుపతిలో ఏపీ03 జెడ్ 0300 నంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా బాలుడి ఆచూకీ తెలియరాలేదు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. . ఎవరికైనా బాలుడి జాడ తెలిస్తే 9440796769, 9440796772 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.