దేశంలో కరోనా తో పాటు ఓమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో..ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 పరిస్థితులపై ఆరా తీశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, హోం శాఖ సెక్రటరీ, రైల్వే బోర్డు సీఈఓ సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వారికి ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
థర్డ్వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు, వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడం, మెడికల్ ఆక్సిజన్, ఔషధాల నిల్వ, వైరస్ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల సంసిద్ధత వంటి అంశాలపై ప్రధాని చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరనున్న నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది.