మహాకవి దాశరధి చైతన్యం రగిలించిన మహా మనిషని తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దాశరది 96వ జయంతిని రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా దాశరధి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాకవి దాశరధి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి అని కీర్తించారు.
జైల్లో నిర్బంధించినా జైలు గోడల మీద కవిత్వాన్నిరాసి ప్రజల్లో చైతన్యం రగిలించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే తెలంగాణ కవులకు గౌరవం లభిస్తోందన్నారు. వారి జయంతులను అధికారికంగా భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. దాశరధి జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం ప్రముఖ కవులకు సత్కారం, పురస్కారాలను అందిస్తున్నామని చెప్పారు.