తెలంగాణలో మహాకూటమితో చావు దెబ్బ తిన్న చంద్రబాబు.. ఏపీ ఎన్నికల్లో ముసుగు కూటమిని రంగంలోకి దించారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముసుగు కూటమిలో జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్, బీఎస్పీ, కేఏ పాల్ సభ్యులుగా ఉన్నారని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనకి మధ్య ఒప్పందం ఉందని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడానికి జనసేన ఆయా స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోందని విమర్శించారు.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.అధికారంతో కోర్టుల్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని వైఎస్ వివేకా హత్య కేసును జగన్ చుట్టూ తిప్పేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు ముందు జరిగిన హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పద్మ స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబసభ్యులను నేరస్తులుగా చిత్రించే విధంగా సీ ఏం చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.