బాలనటుడిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి, ఇప్పటికి అనేక చిత్రాలలో తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తున్న అలీ కి సన్మానం జరిగింది. ఈ వేడుకకు ఏపీసీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలీ రాజకీయాల్లోకి వచ్చి నూతన ఒరవడి సృష్టించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అలీ సన్మాన సభకు చంద్రబాబు హాజరయ్యారు. అలీ దంపతులను గజమాలతో సత్కరించారు.
40 ఏళ్ల సినీ జీవితంలో అలీ కూడా ఎంతో కష్టపడ్డారని, ఓ మంచి వ్యక్తిని అభినందించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమంలో భాగస్వామినయ్యానని పేర్కొన్నారు. జీవితంలో రిలాక్సేషన్ రావాలంటే అలీ లాంటి వ్యక్తులు ఉండాల్సిందేనన్నారు. అలీ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించిన చంద్రబాబు ఆయనకు అన్ని వేళలా సహకరించిన కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను అభినందిస్తున్నట్టు చెప్పారు.