హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవలో 22 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నగరంలోని సైదాబాద్ పూసల బస్తీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
రాజేశ్, జాహ్నవి అనే దంపతులిద్దరూ సైదాబాద్ లోని పూసల బస్తీలో కొన్నేండ్ల నుంచి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. రాజేశ్ సైదాబాద్లోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య శుక్రవారం సాయంత్రం గొడవ చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజేశ్ భార్యపై దాడి చేస్తున్న క్రమంలో 22 రోజుల పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ శిశువు ప్రాణాలు కోల్పోయాడు. శి శువు మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తన బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో ఆవేదన చెందిన భార్య జాహ్నవి.. సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏడాది క్రితం రాజేశ్ భార్యతో గొడవ పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.అప్పుడు పెద్ద కుమారుడిని సరిగా చూసుకోవడం లేదని పోలీసుల విచారణలో తేలడంతో.. ఆ అబ్బాయిని యూసుఫ్గూడ శిశువిహార్కు తరలించారు.