ఓడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో ‘పతిసహగమనం’ జరిగింది. అనుకోకుండా భార్య చనిపోవడంతో తట్టుకోలేకపోయాడు. భార్య చితిమంటలో భర్త కూడా దూకేశాడు. ఆ తర్వాత అతను తీవ్రగాయాలతో మరణించాడు. ఇన్నాళ్ళు కష్టాలు, సుఖాలను పంచుకున్న భార్య ఇక లేదన్న నిజాన్ని తట్టుకోలేకపోయాడు. తమ మూడుముళ్ళ బంధానికి చావే శరణ్యం అన్నట్టుగా కాలుతున్న భార్య చితిలో దూకేశాడు.
ఈ ఘటన కలహండి జిల్లా సియాల్జోడి గ్రామంలో జరిగింది. రాయబారి సబర్ 57 గుండెపోటుతో మంగళవారం కన్నుమూసింది. ఆమెకి భర్త నీలమణి శబర్ మరియు నలుగురు కుమారులు ఉన్నారు. భర్త గ్రామస్తులతో కలిసి భార్య మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్ళి అక్కడ చితి పేర్చి నిప్పు అంటించారు.
అనంతరం తిరిగి అందరు ఇంటికి వెళ్తుండగా ఆమె భర్త నీలమణి మాత్రం వెనక్కి వచ్చి ఒక్కసారిగా ఆమె చితిమంటలో దూకేశాడు. అందరూ చూస్తుండగానే భార్యతో పాటుగా అతను కూడా కాలిచనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిని అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.