హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఆస్ట్రేలియా టూర్కు వెళ్తున్నాడు. టీమిండియాలోకి అతడిని తిరిగి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే జంబో జట్టుతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్ ఆడనుంది. సుమారు మూడు నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్తో పాటు నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కూడా పోటీ పడనుంది. ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో రోహిత్ తొడ కండరాలకు గాయమైంది. దాంతో అతను తదుపరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగా సెలెక్టర్లు రోహిత్ శర్మను ఏ జట్టుకు ఎంపిక చేయలేదు.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో రోహిత్ బరిలోకి దిగడంతో ఈ సెలెక్షన్ వ్యవహారం వివాదాస్పదమైంది. రోహిత్ను కావాలనే పక్కన పెట్టేసారని, ఇందులో విరాట్ కోహ్లీ కుట్ర ఉందని హిట్ మ్యాన్ అభిమానులు ఆరోపించారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కూడా రోహిత్ ఆడటంతో అతను ఆసీస్కు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నెల 27న మొదలయ్యే వన్డే సిరీస్కు రెస్ట్ ఇచ్చి టీ20 సిరీస్లో అయినా రోహిత్ను ఆడించాలనే యోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉందని తెలసింది. ”రోహిత్ శర్మ ఫిట్నెస్ను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. అతడి ఫిట్నెస్ గురించి ఆల్ ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీకి వివరించారు. రోహిత్ శర్మతో మాట్లాడిన తర్వాత వన్డేలు, టీ10 మ్యాచ్లకు విశ్రాంతి నివ్వాలని నిర్ణయించాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ జట్టులో అతడిని పేరును చేర్చాం.” అని బీసీసీఐ వివరించింది.