భారత్ ఆదివారం ఉదయం రెండో బృందాన్ని చైనా నుండి స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ తెల్లవారుజామున 3:10కి వూహాన్ నుంచి బయలుదేరిన మరో ఎయిరిండియా విమానం ఉదయం 9:30 గంటలకు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మొత్తం 323 మంది బయలుదేరగా అందులో ఏడుగురు మాల్దీవులు ఉన్నారని చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. చైనా విదేశాంగ శాఖతో పాటు స్థానిక అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. చైనాలో ఇప్పటివరకు 9 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 300 మందికి పైగా మృతి చెందారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించిన విషయం తెలిసిందే.
రెండో బృందంలోని నలుగురిని చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని తెలుస్తోంది. వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో అధికారులు అనుమతివ్వలేదు. అలాగే శనివారం భారత్కు చేరుకున్న 324 మందిని దిల్లీ సమీపంలోని మానెసర్ క్యాంపునకు తరలించారు. ప్రత్యేక వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తోంది.