telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపికబురు

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టికభారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల టి-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. అంతేకాదు, కొత్తగా సీనియర్ సిటిజన్లకు టి-24 టికెట్ లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్ ను అందించనుంది. 60 ఏళ్ళు పైబడిన వారికే టి-24 టికెట్ లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.

హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టి-24 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ టికెట్‌ను కొనుగోలు చేస్తే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది.

ఎండాకాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం టి-24 టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని, ఆ టికెట్‌ను సీనియర్ సిటిజన్లకు రూ. 80కే అందించాలని నిర్ణయించిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. టి-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

Related posts