ముగిసిన కేసీఆర్ అత్యవసర భేటి..
వరిధ్యానంపై కేంద్రప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదు..
జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు బాధ్యత మంత్రులుదే..
కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం అత్యవసరంగా మంత్రులు, అధికారులతో ఎర్రవెల్లి ఫాం హౌస్లో జరిపిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించింది.
ఈ క్రమంలోనే ఈ నెల 21న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ల అధ్యక్షుడు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అదే రోజున సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించింది. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల పై కేంద్రంపై వత్తిడి తేవాలని నిర్ణయించింది.
ధాన్యం సేకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూనే, లోక్సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పంజాబ్ కు చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు.
తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు.