*అప్పుడే అంబేద్కర్ కోనసీమ అంటే ఇబ్బంది వచ్చేది కాదు
*అమలాపురం ఘటనపై పవన్ రియాక్షన్..
*మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేయించింది వైసీపీయే
కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.
కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే ..కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే బాగుండేదని , అలా చేసి ఉంటే ఇప్పుడు ఇంత విధ్వంసం వచ్చేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని… కొనసీమకు ప్రత్యేక విధానం అవలంబించారని అన్నారు.
అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలని సూచించారు. అంటే గొడవలు పెట్టమని చెప్పారా? మిగతా జిల్లాకు అలాంటి వెసులుబాటు కల్పించలేదెందుకు. అంటే గొడవలు పెట్టాలనే వైసీపీ ప్రభుత్వ విధానంగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది.అంటే గొడవలు పెట్టమని చెప్పారా? మిగతా జిల్లాకు అలాంటి వెసులుబాటు కల్పించలేదెందుకు. అంటే గొడవలు పెట్టాలనే వైసీపీ ప్రభుత్వ విధానంగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది.
నిన్న జరిగిన అల్లర్లులో వెనుక జనసేన, ఇతర పార్టీలున్నాయన్న హోంమంత్రి తానేటి వనిత ఆరోపణలకు తానేమీ ఆశ్చర్యపోవడం లేదని పవన్ అన్నారు. వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఏనాడు తమ తప్పులను ఒప్పుకోలేదని విమర్శించారు
ఆడబిడ్డ అఘాయిత్యానికి గురై న్యాయం కావాలంటే… సాక్షాత్తు హోంమంత్రి చులకనగా మాట్లాడారని విమర్శించారు. తల్లి పెంపకంలో లోపమే అందుకు కారణమనడం ఎంతవరకు సబబు అని పవన్కల్యాణ్ విమర్శించారు.
జిల్లాలు పేర్లు పెట్టినప్పుడు స్థానికులు నుంచి సూచనలు, సలహాలు తీసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములను ఒక్క జిల్లాకి పరిమితం చేశారు. కృష్ణానది తక్కువగా ఉన్న చోట కృష్ణా జిల్లా పేరు పెట్టి.. కృష్ణానది ఎక్కువగా వున్న చోట ఎన్టీఆర్ జిల్లా అన్నారని తెలిపారు. అక్కడే వంగవీటి డిమాండ్ వచ్చిందని అన్నారు. ఇలాంటి పేర్లు పెట్టేప్పుడు సున్నితంగా వ్యవహరించాలని హితవుపలికారు.
జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టడం జనసేన వ్యతిరేకించదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాకు సత్యసాయి పేరు పెట్టడంతో చాలా మంది వ్యతిరేకించారని గుర్తుచేశారు. దీనిపై చాలా మంది తన వద్దకు రాగా, వ్యతిరేకించమని చెప్పానన్నారు.
ఇది ఏపీ ప్రభుత్వ నిర్ణయమని తాను ఏం చేయలేనని చెప్పేశానని పేర్కొన్నారు. ప్రతి నిర్ణయానికి వ్యతిరేకత ఉంటుంది. దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. జిల్లా విభజన, పేర్లపై చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కార్యకర్తలపై దాడి జరిగితే తాను వెళ్తున్నాను అంటే… 144 సెక్షన్ విధించి అలెర్ట్గా ఉన్నారని, మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. ఇదంతా ప్రీప్లాన్డ్ గా జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు. మంత్రి ఇంటివైపు వెళ్తుంటే ఎందుకు ఏం చేయకుండా ఉండిపోయారని విమర్శించారు.
మూడు రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు వాళ్ల డ్రైవర్ శవాన్ని తీసుకొచ్చి ఫ్యామిలీకి అప్పగించి… ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నప్పటికీ పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
వీటన్నింటిని కవర్ చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కలకలం రేపిందని స్పష్టమవుతోందని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న విద్య దీవెన, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలను ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు.
కోడి కత్తి కేసు విచారణ ఎక్కడ వుందో హోంమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డిది హత్యా… ఆత్మహత్యా ఇంకా ఎందుకు తేలలేదని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు కేసుల్లో ఎందుకు విచారణ జరిపించడం లేదు..? ఎందుకు శిక్షలు పడటం లేదని పవన్ కల్యాణ్ నిలదీశారు.
మీ మీద మీరు దాడులు చేయించుకుని సింపతీ పెంచుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కులాలు కలిసి వుండాలని అనుకున్నవాళ్లమని.. తునిలో బోగీలు తగులబెట్టింది మీరే.. దాన్ని వేరే వాళ్ల మీద తోసింది మీరేనంటూ పవన్ ఆరోపించారు. విభజన రాజీకాయలు చేసే ఇలాంటి పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు.