విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో ఉన్న గోశాల నుంచి 50 ఆవులు మాయమైనట్టు కథనాలు రావడంతో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. గోశాలకు మూడు రోజుల కిందట దాతలు కొన్ని గోవులను దానం చేశారని తెలిపారు. ఈ గోవులను పరీక్షించిన పశువైద్యుల సూచన మేరకు వాటిని పాత గోశాలకు తరలించామని వివరణ ఇచ్చారు.
ఈ విషయంపై కొందరు వక్రీకరించి ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తూ పవిత్ర గోశాల ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.