ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కేసీఆర్ లక్ష్యంగా చేసిన విమర్శలపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్, జగన్ లు మోదీ పెంపుడు కుక్కలు అంటూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాలుగేళ్లు మోదీతో అంటకాగారనీ, కాబట్టి తాము కూడా ఆయన్ను పెంపుడు కుక్క అని అనగలమని దుయ్యబట్టారు.
మాకు సంస్కారం ఉంది కాబట్టే అలా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కేసీఆర్, జగన్ హుందాగా వ్యవహరించారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఒక్క పథకంతో అధికారంలోకి రాలేవనీ, విజయం సాధించడంపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయని అన్నారు. టెక్నాలజీ తన వల్లే వచ్చిందని చంద్రబాబు చెబుతుంటారనీ, అలాంటి వ్యక్తి ఈరోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయంటూ చెప్పడం బాధాకరమన్నారు.